6 అబద్ధాలు, 66 మోసాలు.... కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై బీజేపీ చార్జిషీట్ విడుదల

  • ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలు ప్రచారం చేసిన కాంగ్రెస్
  • ఈ ఏడాదిలో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదన్న కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్ సంబరాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వెల్లడి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ గ్యారెంటీలపై బీజేపీ తాజాగా చార్జిషీట్ విడుదల చేసింది. "కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ: 6 అబద్ధాలు, 66 మోసాలు" పేరుతో ఈ చార్జిషీట్ రూపొందించారు. 

దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని ఈ ఏడాది కాలంలో నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఏమీ చేయకుండానే, కాంగ్రెస్ జరుపుకుంటున్న విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యానించారు. విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Charge Sheet
BJP
Six Guarantees
Congress
Telangana

More Telugu News